21, మార్చి 2016, సోమవారం

విశ్వ మహామేధావి బి.ఆర్. అంబేద్కర్

విశ్వ మహామేధావి బి.ఆర్. అంబేద్కర్

Sakshi | Updated: April 14, 2015 01:41 (IST)

 ప్రపంచ మహా మేధావు ల్లో డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒకరు. భారతీయ సమా జాన్ని సమూలంగా మార్చడానికి కృషి చేస్తూ, ఆ క్రమంలో అర్థశాస్త్రాన్ని అన్వయించి సామాజిక సాంస్కృతిక, రాజకీయ, నైతిక, ధార్మిక విషయాల ను చర్చించారు. అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, సంభాషణలు ఇప్పుడు 23 సంపుటాలుగా లభ్యమ వుతున్నాయి. వాటన్నిటిలోని మౌలికాంశాలను పరి చయం చేస్తూ వ్యాఖ్యానించే సంపుటాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పుడు అంబేడ్కర్ సమగ్ర దృక్పథం ఏమిటో తెలుసుకోవడానికి ఇవన్నీ అందు బాటులోకి వచ్చాయి. గతంలో గాంధీ, నెహ్రూలకు ఇచ్చిన ప్రాధాన్యత అంబేడ్కర్‌కు ఇవ్వకపోవడం వల్ల అంబేడ్కర్ సమగ్ర అధ్యయనం సాగలేదు. మరోవైపు మార్క్సిజం సిద్ధాంతాలను ముందుకు నెట్టి అంబేడ్కర్ అర్థశాస్త్ర అధ్యయనాన్ని, అది అస లు ఉందనే విషయం కూడా తెలియకుండా దశా బ్దాలు గడిపేశారు.

 మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో, గాంధీ, నెహ్రూల ఆర్థిక సామాజిక, రాజ కీయ సిద్ధాంతాలతో అంబేడ్కర్  రచన లను తులనాత్మక అధ్యయనం చేసిన ప్పుడు.. భారతీయ సమాజాన్ని పట్టిం చుకుని దాని అభివృద్ధి కోసం నిరంత రం పలవరించిన వారిలో అంబేడ్కర్ తప్ప మరొక జాతీయ నాయకులెవరైనా ఉన్నారా? అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే అంబే డ్కర్ లాగా మన సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి, గ్రంథస్థం చేసినవారు మరెవరూ లేరు.

 అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపా దించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంప దగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉం దని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు బౌద్ధం మరొక మార్గమని ఆచరించి చూపారు. ప్రజాస్వామిక సం స్కృతికి హిందూ మతం, హిందూ సం స్కృతి, మహమ్మదీయ మతం, ఇస్లాం సంస్కృతి పనికిరావని బౌద్ధ సంస్కృతే అందుకు మార్గమని స్పష్టం చేశారు.

 పాశ్చాత్య అర్థశాస్త్రవేత్తలు, మా ర్క్స్, లెనిన్, మావో మొదలైన మార్క్సి స్టులు అర్థశాస్త్రానికి, మతానికి, కులానికి, భావజా లానికి, సామాజికాభివృద్ధికి మధ్య సంబంధం ఉం దని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయని లోతు గా విశ్లేషించలేదు. భారతీయ మార్క్సిస్టు విశ్లేషణలో వర్గం అనే పదంతోనే రాజకీయాలు, ఉద్యమాలు నడిపించారు. మార్క్స్, ఎంగెల్స్‌లు మతం వ్యక్తిగత విషయం అని వదిలేసినట్టు, భారతదేశంలో మార్క్సిస్టులు, కులాన్ని కూడా మతం లాగే వ్యక్తిగత విషయమని వదిలేశారు. తద్వారా ఆధిపత్యంలో ఉన్నవారే సామాజిక, రాజకీయ నాయకత్వంగా ఎదిగే క్రమం కొనసాగుతూ వచ్చింది.

 స్త్రీవాదులు వ్యక్తిగతమైనదంతా సామాజికమై నదే, రాజకీయమైనదే అని నిర్ధారించారు. అయిన ప్పటికీ ఇప్పటికీ వాళ్లు కులాన్ని, మతాన్ని సామా జిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమస్యగా పట్టించుకోలేదు. అంబేడ్కర్ వీరికి భిన్నంగా కులం, మతం, జెండర్, భావజాలం జీవితంలో నిర్వహి స్తున్న పాత్రను పట్టించుకుని వాటికి వ్యతిరేకంగా వేల పేజీల గ్రంథాలను వెలువరించారు. మార్క్సి స్టులు, పాశ్చాత్య అర్థశాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ పని చేయడం లేదు. పైగా ఆ పని చేయడం ప్రధాన అం శాలను పక్కదారి పట్టిస్తుందని ప్రచారం చేశారు. నిజానికి ఇవే ప్రధాన అంశాలని అంబేడ్కర్ జీవిత మంతా స్పష్టం చేస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య విధానాల్లో బహుళ పార్టీ వ్యవస్థలో ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల సంక్షేమాన్ని సామాజి కాభివృద్ధిని సాధించే అర్థశాస్త్రాన్ని అంబేడ్కర్ కలగ న్నాడు. ఆయన రచనల్లో పరుచుకుని ఉన్న అర్థశాస్త్ర అంశాలను ఒకచోట క్రోడీకరించి, సంశ్లేషించి అంబే డ్కరిస్టు అర్థశాస్త్రాన్ని రూపొందించి పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడం అవసరం.

అంబేద్కర్ పేరిట ఓ వెబ్‌పోర్టల్‌


PUBLISHED: MON,FEBRUARY 15, 2016 12:23 AM

వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచనలను ప్రజలకు చేరవేయడానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ పేరిట ఓ వెబ్‌పోర్టల్‌ను రూపొందించాలని నిర్ణయించింది. దీనిద్వారా అంబేద్కర్ రచించిన ఇంగ్లిష్, మరాఠీ రచనలను 9భాషల్లోకి అనువదించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన పూర్తి రచనలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్టు మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ పోర్టల్‌ను వచ్చే నెల మార్చిలో ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.

అంబేద్కర్ ను అంతం చేస్తున్నారు! ఆపగలవారున్నారా?


అంబేద్కర్ ను అంతం చేస్తున్నారు!
ఆపగలవారున్నారా?
దేశంలో ఎక్కడ చూచినా అంబేద్కర్ పేరు వినవస్తున్నది. వినిపించే వారెవరనుకున్నారు? కాంగ్రెసు, భారతీయ జనతాపార్టీ, జనతాదళ్ పార్టీలు అంబేద్కర్ ను భుజాన వేసుకొని మోస్తున్నాయి. పోటీపడి ఫోటోలు చేస్తున్నారు. అంబేద్కర్ ను తెగ పొగిడేస్తున్నారు. అన్ని పార్టీలు,అందరు రాజకీయవాదులు అంబేద్కర్ ను గౌరవిస్తుండగా ఇక కావాల్సిందేమున్నది! సాంఘీకన్యాయం రాకేం చేస్తుంది!
ఒకసారి జాగ్రత్తగా చరిత్రను పరిశీలించండి. హిందూమతం హింసతో జంతుబలులు చేస్తూ యజ్ఞయాగాదులు జరుపుతూ వున్నా రోజులలో బౌద్ధం పుట్టింది. అహింసావాదం ప్రచారం చేసింది. సంఘంలో వున్నా హెచ్చుతగ్గులు పోవాలన్నది, స్త్రీపురుషులు సమానం అనీ, మానవులంతా ఒకటేనని అన్నది.
ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు. ఆదరించారు. అనుసరించారు. అప్పుడేం జరిగింది? హిందూమతం పునరుద్ధరణ పేరిట, రాజుల సహాయంతో శంకరాచార్యులు మొదలైనవారు బౌద్ధాన్ని చంపేశారు. బౌద్ధభిక్షువులను నాశనం చేసారు. బౌద్ధ ఆరామాలను కొన్నిచోట్ల దేవాలయాలుగా మార్చారు. అయినా, బౌద్ధం పూర్తిగా నాశనం కాకపోయేసరికి, బుద్దుడిని పొగడడం ప్రారంభించారు. నేడు అంబేద్కర్ ను పొగిడినట్లే నాడు బుద్ధుడిని ఆకాశానికి కెత్తారు. తెలివిగా. బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక్కడన్నారు. దేవుడు అనే భావనను దూరంపెట్టిన బుద్దుడినే దేవుడిగా మార్చి కొలిచారు. కాని బుద్ధుడి భావాలు అమలుపరచలేదు. సమానత్వం అనే మూలభావాన్ని ఆచరించలేదు. కాని బౌద్ధాన్ని పారద్రోలగాలిగారు.
మనదేశంలో బౌద్ధం నాశనంగావడం పునర్వికాసానికి,హేతువాదానికీ, మానవ వాదానికి ప్రమాదంగా పరిణమించింది. కులాల హెచ్చుతగ్గులు మళ్ళీ విజృంభించాయి. బౌద్ధులకు, హిందువులకు జరిగిన పోరాటంలో అంటరానితనం పుట్టింది. సంస్కరణవాదులు ఎందరు పైపైన ప్రయత్నించినా, హిందూ సమాజంలోని దోషాల్ని తొలగించలేక పోయారు. ఈ దోషాలకు మూలాధారంగా "పవిత్ర" మతగ్రంథాలు,శాస్త్రాలు నిలిచాయి. వాటి జోలికి పోకుండా తలపెట్టిన సంస్కరణలు హిందూమతాన్ని అందలి దోషాల్ని తొలగించలేకపోయాయి. 20వ శతాబ్దంలో అంటరానితనాన్ని పాటించే హిందూ సమాజం ప్రపంచం దృష్టిలో తలవంపులకు గురైంది.
అలాంటి స్థితిలో అంబేద్కర్ వచ్చి కూలంకషంగా హిందూ సమాజంలోని దోషాల్ని పరిశీలించారు. వాటిపై పోరాడారు. ధ్వజమెత్తారు. ఆయన చెప్పినవి, చేసినవి సబబే అనిపించారు. అంటరాని కులాలవారు,శూద్రులు సమాజంలో గణనీయంగా వున్నారు. వారికి ఓట్లున్నాయి అని లేనిదే ఏ పార్టీ గెలవదు. కనుక రాజకీయపార్టీలు కొత్త ఎత్తుగడలతో, తాత్కాలికంగా ఓటర్లను మభ్యపెట్టే వ్యూహాలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగా నేడు అంబేద్కర్ ను తెగ పొగిడేస్తున్నారు. అది విని అటు షెడ్యూల్ కులాలు,అటు శూద్రకులాలు సంతోషపడి ఓట్లు వేయాలని రాజకీయ పార్టీల ఉద్దేశం.
అంబేద్కర్ సిద్ధాంతీకరించిన వాటిని ఆమోదించి ఆచరిస్తామంటే అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అందుకే యీ వ్యాసం. అంబేద్కర్ రాసినవి,చెప్పినవి ఏ రాజకీయపార్టీ ఆమోదిస్తున్నది? ఎంతవరకు ఆచరించగలవు అనేదే యిప్పటి పరిశీలనాంశం. నిజంగా ఆమోదిస్తే సంతోషం. కాని పొగుడుతూ,గోతులు తవ్వి అంబేద్కర్ ను పూర్తిగా చంపేయాలనే ఎత్తుగడ అయితే, జాగ్రత్త పడాలి. ఆ విషయం శ్రద్ధగా, లోతుగా పరిశీలించాలి. అంబేద్కర్ పేరిట, కొందరు బయలుదేరి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ కమిటీలు వేయమనీ, విగ్రహాలుప్రతిష్ఠించమనీ, ఉత్సవాలు జరపమనీ కోరుతున్నారు. ఇలాంటి అంబేద్కర్ వాదులను సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధమే. అది కూడా అంబేద్కర్ వాదాన్ని ఉరితీయడానికి పన్నుగడే. ఈ విషయం గ్రహించడానికి అంబేద్కర్ వాదులకు కొంతకాలం పట్టొచ్చు. ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది.
ముందుగా కాంగ్రెసుపార్టీ అంబేద్కర్ వాదం పరిశీలిద్ధాం:
కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ ప్రేమ
"కాంగ్రెస్, గాంధీజీ అంటరాని వారికేం చేశా"రని ప్రశ్నిస్తూ అంబేద్కర్ పుస్తకం రాసి, గాంధీ బ్రతికుండగానే ప్రచురించారు. ఆ ప్రశ్నలకు నాటికీ, నేటికీ సమాధానం రాలేదు. బహుశా రాదుకూడా. గాంధీజీ సమాధానం చెప్పకపోవడానికి వ్యూహం,ఎత్తుగడ కారణాలైతే,కాంగ్రెసువారు జవాబివ్వకపోడానికి అశక్తత కారణం. అప్పటి కాంగ్రెసు వేరు, నేటి కాంగ్రెసు వేరు అనడానికి వీలున్నదా అంటే,వీల్లేదేమో. 100 సంవత్సరాల కాంగ్రెసు ఉత్సవాలు జరుపుకున్న కాంగ్రెసువారు, కాంగ్రెసు సంస్కృతి పుణికి పుచ్చుకున్నట్లు సహర్వంగా చెప్పుకున్నారు. కనుక, అదంతా చరిత్ర. నేడు కొత్తగా ఆరంభిద్ధాం అనడానికి వీల్లేదు. అలాగే కాంగ్రెసుకు గుత్తాధిపత్యంగా గాంధీజీని స్వీకరించిన పార్టీ అంబేద్కర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. అంబేద్కర్ వ్రాసిన పుస్తకం సారాంశంగా ప్రశ్నలేమిటో చాలా సంక్షిప్తంగా ఒక్కసారి కాంగ్రెసువారికి జ్ఞాపకం చేద్దాం. ఆ తరువాత వారేమంటారో వారికే వదిలేద్దాం.
సమాజంలో సంస్కరణలు కావాలని కాంగ్రెసు పుట్టినప్పటినుండీ ఒకవర్గం అభిప్రాయపడినా, రాజకీయ స్వాతంత్ర్యానికే ముందు ప్రాధాన్యత యివ్వాలని బలమైన వర్గం వాదిస్తూ వచ్చింది. కాంగ్రెసులో సంప్రదాయవాదులుగా ప్రభావితం చేసిన బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్ హిందూ సమాజాన్ని వెనకేసుకొచ్చారు. పైకి అన్ని చెప్పినా,కుల హెచ్చుతగ్గులు, అంటరానితనం పోవాలని వారు చిత్తశుద్ధితో కృషిచేయలేదు. అంటరానితనాన్ని డొంకతిరుగుడు వాదంతో అనిబిసెంట్ సమర్చించింది. కాని, అంటరానితనం తొలగించాలంటూ ఆమె అధ్యక్షతన మోసగించడం ఒక పథకం ప్రకారం సాగిపోయిందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.
ఆ తరువాత గాంధీజీ రంగప్రవేశం చేసి,కాంగ్రెసును ఆక్రమించి, అంటరానివారి ఉద్ధారకుడుగా ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించడం, ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. అంటరానితనం తొలగించడానికి కార్యక్రమం చేబట్టాలని 1922లో గాంధీజీ ఆధ్వర్యాన కాంగ్రెసు పార్టీ తీర్మానించింది. దీనినే బార్డోలో తోర్మానం అంటారు. అంతే, తీర్మానంతోనే పని ఆగిపోయింది. గాంధీజీ మాత్రం అంటరానివారి ఆర్తత్రాణపరాయణుడుగా పేరు తెచ్చుకున్నాడు. కాంగ్రెసువారు కమిటీలు వేశారే తప్ప,ఏమీ చేయలేదు. గాంధీజీ మిగిలిన విషయాలలో వెంటాడి పనులుచేయించినా, అంటరానితనం వరకూ తీర్మానాలకే పరిమితం చేశారు. తిలక్ స్వరాజ్యనిధి వసూళ్ళుచేసి, నిర్మాణ కార్యక్రమం సాగించి, అంటరానితనం నిర్మూలనకు ఉపక్రమించారు. గాంధీజీ విజ్ఞప్తి మేరకు ప్రజలు 1921 లోనే 30 లక్షల రూపాయల నిధి యిచ్చారు. అంటరానితనం నిర్మూలనకు ఎంత ఖర్చు చేసారయ్యా అంటే 43 వేలు మాత్రమే. గాంధీజీ ఈ విషయమై ఏమీ అనలేదు.
అంటరానివారికి ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలని అంబేద్కర్ కోరారు. బ్రిటిష్ పాలకులు అంగీకరించారు. ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం అంగీకరించిన గాంధీజీ, అంటరానివారికి ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలంటే ఆమరణ నిరాహారదీక్ష పూనారు. అంటరానివారు శతాబ్దాలుగా ఎలా వుంటున్నా సరే, వారు బాగుపడక పోయినాసరే, గాంధీజీ ప్రాణం విలువైంది గనుక, ఆయన్ను బ్రతికించుకోవాలన్నారు. అంబేద్కర్ పై వత్తిడి తెచ్చి, బలవంతంగా ఆయనచేత ప్రత్యేక ప్రాతినిధ్యం కొరకు పట్టుబట్టనని ఒప్పించారు. అంటే గాంధీజీ కోరినట్లు అంటరానివారు హిందువులలో భాగంగా అలాగే అణిగిమణిగి పడివుండేటట్లు పూనా ఒడంబడిక చేసిందన్నమాట. అంబేద్కర్ ను ఓడించి, గాంధీ నెగ్గి, అంటరానివారిని చాలా అన్యాయాలకు గురిచేశారు.
కేరళలోని గురువాయూర్ దేవాలయంలో అంటరానివారికి ప్రవేశం కల్పించకపోతే ఆమరణ నిరాహారదీక్ష పూనుతానని బెదిరించిన గాంధీజీ ఆ మాట ఎన్నడూ నిలబెట్టుకోలేదు. అగ్రవర్గాలవారు అంటరానివారి దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుంటే, కాంగ్రెసుపార్టీ ఓట్లకోసం అగ్రకులాల వారిని సమర్ధిస్తుంటే, గాంధీ, కాంగ్రెసును ఖండించలేదు.
చీటికిమాటికి సత్యాగ్రహాలు, ఆమరణ నిరాహారదీక్షలు చేసిన గాంధీజీ, ఒక్కసారైనా అంటరానితనం నిర్మూలనకు నిరాహారదీక్ష పూనలేదు. ఎందుకని? హిందూ సమాజంలో అంటరానివారిని అట్టిపెట్టాలని గాంధీజీ ప్రయత్నించడమేగాక సనాతనవాదిగా కులాలు, వర్ణాలు వుండటాన్ని సమర్ధించాడు. వాటికి మూలమైన శాస్త్రాల్ని, గీతను ప్రచారం చేశాడు. కులాన్ని కాదని, వర్ణ వ్యవస్థను సమర్ధించడం కూడా గాంధీజీ ఎత్తుగడే.
కనుకనే గాంధీజీవల్ల జాగ్రత్తగా వుండమని అంబేద్కర్ పదేపదే హెచ్చరించాల్సి వచ్చింది. అంటరానితనం తొలగించనిదే స్వరాజ్యం రాదన్న గాంధీజీ ఒక్కసారైనా నిరాహారదీక్షకు పూనుకోవడం, కాంగ్రెసు చేత ఎలాంటి కార్యక్రమాన్ని చేబట్టించకపోవడం గాంధీజీ చిత్తశుద్దికి గీటురాయి. అలాగే సత్యాగ్రహం అనే ఆయుధాన్ని అంటరానివారి కోసం ఎన్నడూ ఉపయోగించని గాంధీజీ, 1929లో దేవాలయ ప్రవేశానికి అంటరానివారే సత్యాగ్రహానికి పూనుకుంటే, గాంధీజీ స్వయంగా వారిని ఖండించారు. అంబేద్కర్ ఆశ్చర్యపోయాడు. దేవాలయ ప్రవేశార్హత బిల్లును కేంద్ర శాసనసభలో రంగ అయ్యర్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ జనరల్ అనుమతించకపోతే, చూసుకోమరి అని గాంధీజీ బెదిరించాడు. ఎన్నికల దృష్ట్యా యీ బిల్లుకు కాంగ్రెసు పార్టీ మద్దత్తును ఉపసంహరించింది. గాంధీజీ కాంగ్రెసును వెనుకేసుకొచ్చారే గాని, అంటరానివారిని కాదు. హరిజన సేవాసంఘం పక్షాన హక్కుల పోరాటానికి గాంధీజీ ఎన్నడూ అనుమతించలేదు. పైగా హరిజన సేవాసంఘ యాజమాన్యంలో హరిజనుల్ని గాంధీజీ తొలగించారు! పూనా ఒడంబడిక తరువాత అంటరానివారికి కేటాయించిన స్థానాలలో వారిపై పోటీపెట్టవద్దని కాంగ్రెసుకు గాంధీజీ ఎన్నడూ సలహా యివ్వలేదు. కాంగ్రెసు మంత్రివర్గాలలో అంటరానివారికి ప్రాతినిధ్యం వుండాలని గాంధీజీ ఎన్నడో పట్టుబట్టలేదు. పైగా మధ్య పరగణాలలోని మంత్రిమండలిలో అగ్నిభోజ్ అనే అంటరాని ప్రతినిధి నియామకాన్ని గాంధీజీ వ్యతిరేకించాడు.
గాంధీజీ అంటరానివారిపట్ల చిత్తశుద్ధి లేదనడానికి అంబేద్కర్ ఎన్నో ఉదాహరణలు చూపాడు. అలాగే కాంగ్రెసువారి చర్యల్ని వస్త్రకాయంపట్టి వారి విద్రోహచర్యల్ని బట్టబయలు చేశాడు. కనుక వీటికి సమాధానం కాంగ్రెసువారే చెప్పాలి. లేదా, గాంధీజీని, స్వాతంత్ర్యానికి ముందున్న కాంగ్రెసును పూర్తిగా ఖండించాలి. తాము కొత్త అవతారం ఎత్తామని చూపాలి. అది సాధ్యమా? ఆచరణలో కాంగ్రెసువారు ఎలా వున్నారు? అదీ పరిశీలిద్దాం.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన హిందూ కోడ్ బిల్లును సనాతన హిందువులు వ్యతిరేకించారు. జవహర్ లాల్ నెహ్రూ 'పైకి' సెక్యులర్, అభ్యుదయవాదిగా వున్నా ఎన్నికల సమయానికి సనాతనులకు లొంగిపోయాడు. ఫలితంగా అంబేద్కర్ నెహ్రూ మంత్రిమండలి నుండి రాజీనామాచేసి బయటకు పోవాల్సి వచ్చింది. ఆ తరువాత అంబేద్కర్ అంటరానివారి విమోచనకై ఉద్యమించి, "హిందువులలో వున్నంతకాలం వారికి సమానత్వం రావడానికి వీల్లే"దని గ్రహించి, బౌద్ధంలో చేరాడు, చేర్పించాడు. అంటరానివారిపట్ల ప్రేమ నటించిన కాంగ్రెసువారు, అంతవరకూవున్న సౌకర్యాలను, ప్రత్యేక కేటాయింపులను అంబేద్కర్ అనుచరులకు లేకుండా చేశారు. జనతా ప్రభుత్వంలోగాని మళ్ళీ వారి హక్కులు పునరుద్దణ కాలేదు!
అంటరానివారికి, శూద్రులకు ప్రత్యేక ఆహారంగావున్నా ఆవు మాంసం కూడా నిషేధించడానికి వినోబాభావే పూనుకున్నాడు. ఆందోళన జరిగింది. గోవును చంపడం మతపరంగా పాపం అంటూ చిత్రీకరించి, ఆందోళనచేసి, వత్తిడితెచ్చి నిషేధ శాసనాలు చేయించారు. దీనికి కాంగ్రెసు మద్దత్తు వున్నది. ఆహారం ఏది తినరాదో శాసించే స్థితికి పోయారంటే, నియంతృత్వ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు. అడుగడుగునా వినోబాభావే ఆశీస్సులకోసం ఇందిరాగాంధి, కాంగ్రెసువారు ప్రయత్నించారు. హరిజనుల ఉద్ధరణకే కంకణం కట్టుకున్నట్లు నటించిన ఇందిరాగాంధి, 20 సూత్రాల పేరిట హరిజన ఓట్లకై గాలంవేసి నెగ్గింది. కాంగ్రెసు పార్టీలో వచ్చిన చీలికను తనకు అనుకూలంగా మలచుకోగలిగిన ఇందిరాగాంధి, ఆర్ధికంగా హరిజనులకు ఏవో పంచుతున్నట్లు చూపి, రాజకీయంగా వారిని నిర్వీర్యుల్ని చేసింది. అంటరానితనాన్ని పాటించే శంకరమఠాలను ఆమె ప్రోత్సహించడమే గాక, దక్షిణాదిలో శంకరాచార్యుల ఆశీస్సులకోసం తరచు వచ్చింది. అలాంటి శంకర ఆశ్రమాలలో స్మార్త బ్రాహ్మణులే వంటలు చేయాలని నేటికీ కట్టుదిట్టాలు పాటిస్తున్నారు. తల్లి అడుగుజాడల్లోనే రాజీవ్ గాంధీ కూడా అనుసరిస్తున్నాడు.
అంటరానితనం పాటిస్తున్నారంటూ మంత్రాలయం (కర్నూలు) గురించి మొత్తుకున్న మసాల ఈరన్నపై రాఘవేంద్రస్వామి ఆలయాధిపతులు కేసులుపెట్టి వేధిస్తే కాంగ్రెసువారు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. చివరకు ఇందిరాగాంధీ పాలనలో ఉక్కిరిబిక్కిరి అయినట్లు భావించిన జగజీవన్ రామ్ కూడా కాంగ్రేసునుండి బయటపడిపోవాల్సి వచ్చింది. హరిజనుల పట్ల మొసలి కన్నీటితో కాంగ్రెసుపార్టీ, వారిని భ్రమలో అట్టిపెడుతూ వస్తున్నది. ఆచరణలో మాత్రం శాస్త్రాలను, మఠాలను సమర్ధిస్తూ, అగ్రకులాన్ని కొమ్ముకాస్తున్నది.
అంటరానితనం తొలగించడానికి కాంగ్రెసు నాడూ నేడూ చిత్తశుద్ధిని చూపలేదు. నేటికీ ఓట్లకై అంటరానివారిపట్ల ప్రేమ ఒలకబోసి మోసం చేస్తున్నది. కాంగ్రెసుపార్టీ నిర్వాకం అలాగున్నది. పదవులకోసం కొందరు కాంగ్రేసులోవుంటూ అంటరానివారిపట్ల తీవ్రద్రోహం చేస్తూ, అంబేద్కర్ ఉద్యమాన్ని ఉరితీస్తున్నారు. ఈ విషయం వారికి తెలియకకాదు. తాత్కాలిక ప్రయోజనం, స్వార్ధం దృష్ట్యా అలా చేస్తున్నారు.
భారతీయ జనతాపార్టీ - అంబేద్కర్
అంబేద్కర్ కు ప్రస్తుతం దేశంలో కొత్త అభిమానులు ఏర్పడ్డారు. భారతీయ జనతాపార్టీ ఇటీవల ఒకనాట గాంధీజీని, మరోనోట అంబేద్కర్ ను పొగుడుతూ, వారి ఆశయాలను ఆచరిస్తామంటున్నది. ఒకే వేదికపై గాంధీజీని, అంబేద్కర్ ను చేర్చారంటేనే బిజెపిని శంకించవలసి వస్తున్నది. గాంధీజీని కొత్తగా గుత్తకు తీసుకున్న బి.జె.పి. తమ ఎత్తుగడలో అంబేద్కర్ ని కూడా చేర్చడం గమనార్హం.కాని యీ ఎత్తుగడ విఫలంగాక తప్పదు. అంబేద్కర్ లో బి.జె.పి ఆమోదించే అంశమేదీ కనిపించడం లేదు. కేవలం ఓట్ల కోసమే, కాంగ్రెసువారి వలె, బి.జె.పి కూడా అంబేద్కర్ ను శ్లాఘిస్తున్నా, అది మరీ కృత్రిమంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది. అయినా, బి.జె.పి నీతికి తానే పట్టం గట్టినట్లు పేర్కొంటున్నందున్నవారి విషయం పరిశీలించవలసి వుంది.
ఇటీవలే బి.జె.పి. వారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికై కంకణం కట్టుకున్నారు. రామరాజ్యం నిర్మిద్దాం అంటూ, అయోధ్య మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా బి.జె.పి కార్యకర్తలు రాళ్ళు మోసుకొని వెళ్ళారుకూడా. అదంతా మతకలహాలకు దారితీసింది. కాని అంబేద్కర్ ను పొగుడుతూ, ఆయన ఆశయాలను పాటిస్తామంటున్న బి.జె.పి వారికి అసలు విషయం తెలియదనుకోలేం గదా! అందులో బాగా చదువుకున్న నాయకులు, అనుచరులు ఉన్నారు. వారిలో అందరూ కాకున్నా, కొందరైనా అంబేద్కర్ రచనలు చదివి వుంటారు. హిందూమతాన్ని గురించి, రాముడిని-రామాయణాన్ని గురించి అంబేద్కర్ రాసింది వారి దృష్టికి వచ్చే వుంటుంది. అంబేద్కర్ రచనలలో అముద్రితంగా వున్న రచనలు కొన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించగా, అందులో రాముడి గురించిన విషయమై పెద్ద ఆందోళన జరిగింది. బి.జె.పి.,శివసేన, హిందూ ఛాందసులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక అంబేద్కర్ లో బి.జె.పి. వారు అంగీకరిస్తున్నదేమిటో, నిరాకరిస్తున్నదేమిటో జనానికి తెలియాలి. ఫలానా విషయం తృణీకరిస్తున్నామంటే, ఎందుకో కారణాలు కూడా బి.జె.పి. చెప్పాలి. ఇదేమీ చేయకుండానే బి.జె.పి. హఠాత్తుగా అంబేద్కర్ వర్ధంతులు, జయంతులు జరుపుతూ వూరేగింపులు చేస్తుంటే అంబేద్కర్ వణికిపోతుండాలి! బుద్ధుడికి హిందువులు పట్టించిన గతి, అంబేద్కర్ కు బి.జె.పి. వారు పట్టించదలచారా?
అంబేద్కర్ హిందూమతాన్ని ఖండించారు. వేదాలనుండే మొదలైన వర్ణవ్యవస్థ, పురుషసూక్తంనుండీ 4 వర్ణాల వర్ణన పేర్కొని, నిరసించారు. ధర్మశాస్త్రాల అమానుష నియమాలను, రామాయణ,మహాభారత అవినీతి పంధాను బట్టబయలు చేశారు. హెచ్చుతగ్గుల హిందూసమాజంలో శూద్రుల స్థితి,బౌద్ధంపై పోరాడి సృష్టించిన అంటరానితనం హిందువులు ఎలా పోషించారో చారిత్రకంగా పేర్కొన్నారు. హిందువులు పూర్వం యజ్ఞయాగాదుల పేరిట ఆవుల్ని చంపి, ఆవు మాంసం తిన్న ఉదంతాల్ని చూపారు. హిందూమతంలో అంటరానివారికి స్థానం లేదనీ, సమానత్వం రాదనీ స్పష్టం చేశారు. కనుక హిందూమతాన్ని తృణీకరించి, బౌద్ధులుగా మారి అంటరానివారంతా సమానతను సాధించుకోవాలన్నారు.
అంబేద్కర్ కేవలం ద్వేషంతో, పగతో హిందువులలో అగ్రవర్గాల వారిని, ముఖ్యంగా బ్రాహ్మణ ఛాందసులను తిట్టలేదు. సుదీర్ఘంగా పరిశోధించి, ప్రమాణాలతో విషయ పరిశీలన చేసి చూపారు. పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తి ప్రస్తావించారు.
మనువు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్న అమానుష, క్రూర, ఘోర నియమాలు, నిషిద్ధాలు, అక్రమశిక్షలు, నిచ్చెనమెట్ల సమాజాన్ని బిగించిన తీరు చూపారు. అంటరానితనాన్ని శాస్త్రోక్తంగా సమర్ధిస్తున్న ధర్మాలను అంబేద్కర్ చూపారు. ఇవేవీ తెలియనట్లు బి.జె.పి. నటిస్తోందా? లేక అవన్నీ మరచిపోదాం అంటోందా? అంబేద్కర్ ఆశయాలు అమలు జరగాలంటే, కొన్ని శాస్త్రాల్ని, గీతను, వేదాలను, రామాయణ, మహాభారతంలోని అంశాలను, ధర్మశాస్త్రాల్ని పక్కన బెట్టాలి. వాటిని పాటించరాదని,మానవ హక్కులకు అవి విరుద్ధమని గ్రహించాలి. పాఠ్యగ్రంథాలలో యీ అంశాలు రాకుండా చూడాలి. అంటరానితనాన్ని పాటించే ఆశ్రమాధిపతుల్ని ఖండించాలి. ఇవి చేయడానికి బి.జె.పి. సిద్ధపడితే మనం సంతోషించాలి, ఆహ్వానించాలి. కేవలం అంబేద్కర్ ను పొగిడితే అది ఓట్ల వ్యూహంగానే భావించాలి. ఎన్నికల నినాదంలో (ప్రణాళికలో) రాంమందిర్ ప్రస్తావన బి.జె.పి. విరమించాలి. రాముడిని గురించి అంబేద్కర్ ఏమంటున్నాడో చూద్దాం:
రాముడు కావాలా? అంబేద్కర్ కావాలా? తేల్చండి
రాముడిని దేవుడిగా పరిగణిస్తూ వుండేవారు,అతడు సీత శీలాన్ని శంకించి ప్రవర్తించిన తీరుకు అసహ్యపడాలి. ఈ విషయంలో రాముడి చర్య నేరంతో కూడింది. రాజుగా రాముడు, తపస్సుచేస్తున్న శూద్రుడు శంబుకుడిని చంపడం, అతడు ధర్మాన్ని అతిక్రమించాడనడం, ఇదంతా ఒక చనిపోయిన బ్రాహ్మణ యువకుడి నిమిత్తం చేశాడనడం తప్పు.
రాముడి పుట్టుక వ్యవహారమంతా వ్యభిచారంతో కూడినదే. బుద్ధ రామాయణం ప్రకారం సీత రాముడి సోదరి. కనుక యీ యిరువురి పెళ్ళి ఆదర్శం కాదు. రాముడు ఏకపత్నీవ్రతుడూ కాదు. వాల్మీకి రామాయణాన్ని బట్టి కూడా రాముడికి చాలామంది భార్యలున్నారు. (అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకం)ఇంకా ఉంపుడుకత్తెలు కూడా రాముడికి వున్నారు. రాముడిని దేవుడిగా చూచేవారు ఈ విషయాలు పరిగణలోకి తీసుకోవాలని అంబేద్కర్ అన్నారు. సమాధానం చెప్పజాలని భక్తులు కర్రలు తీసుకొని వీధిన పడ్డారేగాని సహనంతో చర్చించలేకపోయారు. అదీ "రామ" సంస్కృతి.
మనం కోరుకునే మానవ హక్కుల్ని హిందూమత సమాజంలో సాధించడం సాధ్యంకాదని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సమానత్వం లేదు. స్వేచ్ఛకు గుర్తింపు లేదు. జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో వుంచే అవకాశం లేదు. సౌభ్రాతృత్వం అసలే లేదు. కనుక హిందూమతం ప్రజాస్వామిక విలువలకు చోటు పెట్టడం లేదని అంబేద్కర్ స్పష్టం చేశాడు(ఫిలాసఫి ఆఫ్ హిందూయిజం). హిందూ ధర్మాలు, పవిత్ర గ్రంథాల ఆధారంగానూ, ఆచరణరీత్యానూ జరుగుతున్న తంతును అంబేద్కర్ విశదీకరించాడు. సాంఘిక న్యాయానికి తోడ్పడని హిందూమతాన్ని అమానుషమైనదిగా సహజంగానే అంబేద్కర్ నిర్ధారించాడు.
బి.జె.పి. వారు అంబేద్కర్ తత్వాన్ని, వాదనల్ని ఏ మేరకు అంగీకరిస్తున్నారో,ఎక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలి. అంటరానితనం పోవాలి అని చిలుకపలుకులు ఉచ్ఛరిస్తే సరిపోదు. అది ఎలా సృష్టి అయిందీ, మూలస్థంభాలుగా నిలచి దీనిని ఎవరు పోషిస్తున్నదీ, అది పోవాలంటే ఏం చేయాల్సిందీ అంబేద్కర్ చెప్పారు. హిందూ సమాజం పాటిస్తున్న యీ మహానేరం ప్రపంచ చరిత్రలోనే మచ్చగా నిలచింది. అంబేద్కర్ ను వాడుకుని ఓట్లు తెచ్చుకుందామనే బి.జె.పి. తప్పు త్రోవలో పయనిస్తున్నదేమో చూచుకోవాలి. బుద్ధుడిని చంపేసినట్లే, అంబేద్కర్ ని కూడా నాశనం చేయాలనే పెద్ద కుట్రలో భాగస్వామిగా బి.జె.పి. వ్యవహరిస్తున్నదా? కాదంటే, అందుకు భిన్నంగా ఆచరణలో కనిపించాలి.
జనతాదళ్ కూడా అంబేద్కర్ ను గౌరవిస్తున్నది. పార్లమెంటు హాలులో నిలువెత్తు ఫోటో పెట్టమన్నారు. హరిజనులపై అత్యాచారాల్ని అందరూ ఖండిస్తున్నారు. కాని వాటికి మూలంగా నిలచిన మతం, ధర్మశాస్త్రాలు, ఆశ్రమాలు, హిందూ దురభ్యాసాలు రూపుమాపకుండా, అంబేద్కర్ ను గౌరవించడం సాధ్యం కాదని గ్రహించాలి. కాంగ్రెస్, జనతాదళ్ ఒక తానులో వస్త్రాలే. ఎటొచ్చీ బి.జె.పి. కొంచెం భిన్నమైంది. ముగ్గురూ కలసి అంబేద్కర్ వాదాన్ని తియ్యని మాటల్తో, చేతల్తో ఉరితీయదలచారు. ఈ విషయం అమాయకులైన వారికి అర్థం గావడానికి కొంత సమయం పట్టొచ్చు.
మార్క్సిజం - అంబేద్కర్
అంటరానివారు, శూద్రులు హెచ్చుతగ్గుల సమాజంలో అనుభవిస్తున్న కిరాతక చర్యల్ని గమనించిన అంబేద్కర్ అనేక మార్గాంతరాలను అధ్యయనం చేశారు. ప్రపంచంలో అనేక మందిని ఆకర్షించిన మార్క్సిజాన్ని ఆయన పరిశీలించకపోలేదు. బౌద్ధాన్ని, మార్క్సిజాన్ని పోల్చి కూడా అంబేద్కర్ చూచాడు.
శాస్త్రీయ సోషలిజంగా తన సిద్ధాంతాన్ని నిలపదలచిన మార్క్స్ అది విధిగా వచ్చి తీరుతుందని భావించినట్లు అంబేద్కర్ విశ్లేషించాడు. కాని 1917లో రష్యాలో వచ్చిన విప్లవం మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా రాలేదన్నాడు. అది విధిగా సంభవించలేదంటే, ఎంతోహింస, రక్తపాతం జరిగిందనీ, మానవ ప్రయత్నం వలన రష్యాలో విప్లవం వచ్చిందనీ అంబేద్కర్ చెప్పారు. చరిత్రను ఆర్ధిక దృక్పధంతో చూడడం సరైనది కాదని రుజువైందని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. క్రమేణా కార్మికుడు పేదరికంలోకి పయనిస్తున్నట్లు కూడా సిద్ధాంతీకరించడాన్ని ఎవరూ అంగీకరిచడం లేదన్నారు. ప్రపంచాన్ని పునర్నిర్మించడమే తత్వం చేయాల్సిన పని అని మార్క్స్ చెప్పింది సరైనదిగా అంబేద్కర్ భావించారు. వర్గాలమధ్య సంఘర్షణవున్నట్లు మార్క్స్ అన్నది వాస్తవం. వ్యక్తిగత ఆస్తివలన ఒకరు శక్తివంతమైన వర్గంగా, దోపిడీ వలన పరిణమిస్తున్నారు. ఈ వ్యక్తిగత ఆస్తిని తొలగించి సమాజం శ్రేయస్సును కాపాడాలి.
ఈ లక్ష్యాలను సాధించడానికి మార్క్స్, హింసను, కార్మిక నియంతృత్వాన్ని సూచించగా, బుద్ధుడు అహింసను, మానసిక మార్పును అవలంబించాడు.
మార్క్సిజంలో రాజ్యపరమైన సిద్ధాంతం బలహీనమైనదని, శాశ్వతంగా నియంతృత్వాన్ని అది సూచిస్తున్నదనీ అంబేద్కర్ విమర్శించాడు. రాజ్యం హరించిపోతుందని చెప్పినా అది ఎన్నడు జరుగుతుందో, అలా జరిగిన అనంతరం ఏమౌతుందో స్పష్టపరచలేదన్నాడు.
రష్యా విప్లవం సమానత్వాన్ని సాధిస్తుందని ఆహ్వానించాం. కాని స్వేచ్ఛ, సౌభ్రాతేత్వం లేని సమానత్వం సమాజానికి అనవసరం. కమ్యూనిజంలో ఇవి లేవు గనుక తృణీకరించాలని అంబేద్కర్ అన్నాడు.
ముగింపు
అంబేద్కర్ భారత సమాజాన్ని విభిన్న కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశోధనా ఫలితాలను ప్రచురించారు. శూద్రులెవరు అనే అంశం తీసుకొని,వేదకాలం నుండీ వర్ణాలుగా విభజించి చీల్చిన విషయాలను చూపారు. వేదాలలో వర్ణాలు లేవనే వారి వాదనని ఖండించారు. వర్ణాలు, కులాలు వేరని చూపి, సమర్ధించుకొనే ధోరణులు కూడా అంబేద్కర్ ఖండించారు. ఈ విషయంలో ఆర్యసమాజ్, గాంధి మొదలైన వారంతా అంబేద్కర్ విమర్శలకు గురైనారు. చారిత్రకంగా బ్రాహ్మణులు నిర్వహించిన పాత్ర వివరంగా పరిశీలించాడు.
అంటరానివారంటూ మనువుకు పూర్వం లేరనీ, గుప్తుల కాలం నుండీ యీ జాడ్యం అమలులోకి వచ్చినట్లు అంబేద్కర్ చూపారు. మను ధర్మశాస్త్రాన్ని బాగా పరిశీలించి, ఖండించారు. ఆమాటకొస్తే ధర్మశాస్త్రాలలోవున్న హెచ్చుతగ్గుల ప్రస్తావన, అమానుష ధోరణులు అంబేద్కర్ విమర్శలకు గురైనాయి. హిందువులకు, బౌద్ధులకు జరిగిన సంఘర్షణలో అంటరానివారు ఏర్పడినట్లు, అలాగే గోవధ నిషేధంకూడా మతపరం చేసినట్లు చూపారు.
హిందూ సమాజంలో ప్రజాస్వామిక లక్షణాలు, మానవహక్కులు లేవని, ఉండడానికి వీల్లేదని సోదాహరణగా అంబేద్కర్ తెలిపారు. సమానత్వం సోదరత్వం, స్వేచ్ఛలకు హిందూమతంలో తావులేదన్నారు. హిందూమతం అనేది కలగాపులగం అనీ, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధంలవలె నిర్దుష్టంగా నిర్వచించ వీల్లేదనీ విపులీకరించారు.
హిందువులలో భాగంగా అంటరానివారిని పరిగణించినంతకాలం వారికి విమోచన, సమానత్వం, స్వేచ్ఛ రాదని అంబేద్కర్ నిర్ధారించారు. అందుకే వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలన్నారు.
రాజకీయాధికారం లేనిదే, అంటరానివారికి హక్కులు ఏర్పడవనీ, బానిసలకంటె అధములుగా వారిని చూస్తారని అంబేద్కర్ పేర్కొన్నాడు.
ఆచరణలో, రాజకీయవాదులు కేవలం ఓట్ల కోసం అంటరానివారిపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు అంబేద్కర్ గ్రహించారు. ఇందులో అగ్రగణ్యుడు గాంధీజీగా ఆయన పసిగట్టి పోరాడారు. గాంధీ చెప్పే మాటలకు, చేసేవాటికి ఎలా పొంతనలేదో చూపారు. హిందువులలోనే అంటరానివారిని అట్టిపెట్టి, శాశ్వత వెట్టిచాకిరీ చేయించుకొనే ధోరణిని గాంధీ సమర్ధించారన్నారు. బౌద్ధంలో మాత్రమే సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం లభించగలవని అంబేద్కర్ నమ్మారు. బౌద్ధం మనదేశంలో ఏనాడో చంపేయబడింది. దీనిని పునరుద్ధరించడం చాలా కష్టమని అంబేద్కర్ గ్రహించలేదు. మానవ హక్కులకై అంబేద్కర్ పోరాటం ముందుకు సాగించవలసివుంది.
అంబేద్కర్ మనువా?
అంబేద్కర్ ను తరచు మనువుతో పోల్చి, ఆధునిక రాజ్యాంగనిర్మాత అనీ, ఆధునిక మనువు అనీ నాజూకుగా తిడుతుంటారు. జీవితమంతా అంబేద్కర్ ఎన్నో పరిశోధనలు చేసిమనువుచేసిన ఛండాలమంతా బయట పెట్టాడు. మనదేశంలో విప్లవ ప్రతీఘాతుకం మనువుతోనే వచ్చిందన్నాడు. అంటరానితనం మనువునుండే ఆరంభమైనదన్నాడు. ఆడవాళ్ళకు స్వేచ్ఛ పోవడం, హక్కులు పోవడం మనువుతోనే మొదలయ్యాయన్నాడు. అలాంటి చండాలపు మనువుతో అంబేద్కర్ ను పోల్చడం పరోక్షంగా ఆయన్ను అవమానపరచడమే.
మన రాజ్యాంగాన్ని తగులబెట్టాలని అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాల్గొన్నప్పటికీ, తనకు యిష్టం లేనివి ఎన్నో చోటుజేసుకోవడంతో ఆయన అలా భావించాల్సి వచ్చింది. కనుక రాజ్యాంగంలోవున్న వాటన్నిటికీ అంబేద్కర్ ను బాధ్యుడుగా చేయడమూ భావ్యంకాదేమో.
అంబేద్కర్ ఆరంభించిన కృషి అడుగడుగునా అగ్రకులాల అవరోధాలతో వెనుకంజ వేసింది. కనుక రాజకీయ, ఆర్థిక, మత ప్రలోభాలకు లొంగక, మానవహక్కుల నిమిత్తం పోరాడటం, అంబేద్కర్ లక్ష్యాలను సాధించడానికి కృషిచేయడమే.

బాబాసాహెబ్ భారతమిదేనా ?

బాబాసాహెబ్ భారతమిదేనా ?


సాంఘిక విప్లవమూర్తి, నవభారత నిర్మాత, భారతదేశ మార్గదర్శి, మహోన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమున్నత విలువలకు నిలువెత్తు రూపం విశ్వరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్. అవినీతి, అరాచకం, అన్యాయం రాజ్య మేలుతున్న తరుణంలో అంబేద్కర్ ఆశయాలు ,ఆదర్శాలు, విలువలు సమాజాన్ని మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయి. మరింత పక్కా ప్రణాళికతో అంబేద్కరిజాన్ని సమాజానికి అందించాలి. అంటరాని కుటుంబంలో జన్మించినా, అన్నిరకాల అసమానతలు, బానిస, వివక్ష సంకెళ్ళను తెంచుకుని ఆయన ఎదిగిన క్రమం తరానికైనా నిత్య స్ఫూర్తే. తన ఆశయ సాధనలో రోజూ ఆయన తను నమ్మిన విలువలకు తిలోదకాలు ఇవ్వలేదు. ఆత్మగౌరవానికే ప్రాధాన్యత ఇచ్చి ...కేవలం పదవి కోసమే ...కుట్రలు పన్నే వారి కుయుక్తులకు ఎంతో దూరంగా ఉన్నారు. ఇలాంటి మహనీయుని జీవిత మార్గం రేపటి ఆధునిక భారతానికిి కూడా ఎంతో ఆవశ్యకం.



అయన వాదం అంబేద్కర్ వాదం, అది విశ్వజనీనం, అది ఆదర్శవాదం, మానవవాదం, నిరంతర వాదం, భారతంలో అంబేద్కర్‌కి సరైన న్యాయం జరగలేదు.అంబేద్కర్ వాదమే సరైనదని, ఆయన ప్రతిపాదించిన ప్రజాస్వామ్యమే ఆచరణీయమని ప్రపంచమంతా చాటిచెబుతూ, దాని ఆచరణకై అన్ని రకాల మార్గాలను శోధిస్తున్న సమయంలో నిజంగా అంబేద్కర్ వాదులమని చెప్పుకునే కొందరు అనుసరిస్తున్న మార్గాలు,గమ్యాలు మాత్రం అగమ్యగోచరంగా తయారయ్యాయి.ఇలాంటి విపరీత ధోరణి, మనస్తత్వం ఉన్న మనుషులు ఉంటారని,ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆనాడే అంబేద్కర్ ఎంతో ఆవేదనతో ఆగ్రా ఉపన్యాసంలో పేర్కొన్నారు.

ఆయన చెప్పినది ఆయన మాటల్లోనే .......'చదువుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. విద్యావంతులలో కొంత అభివృద్ధి ఉంది. విద్య వల్ల కొందరు ఉన్నత స్థ్తానాలకు ఎదిగారు. కాని విద్యావంతులే నన్ను మోసం చేశారు. వీరు ఉన్నత విద్యావంతులైన తరువాత సమాజానికి సేవ చేస్తారని అనుకున్నాను. కానీ చిన్నా, పెద్దా అంతా పోగై వారి వారి కుటుంబాల బాగోగులు మాత్రమే చూసుకుంటున్నారు'. 1956 మార్చి 18 తన చారిత్రక ఆగ్రా ఉపన్యాసం లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవేదన ఇది. ఉపన్యాసం అంతా.... రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎదిగిన ప్రభుత్వ ఉద్యోగుల స్వార్థ పూరిత విధానాలను,వారు అణగారిన వర్గాలకు ఏమాత్రం ఉపయోగపడకుండా ఉన్నారన్న వారి సంకుచిత దృక్పథాన్ని స్పష్టంగా వివరిచింది.ఇదే ఉపన్యాసంలో అంబేద్కర్ వివిధ వర్గాలకు వివిధ ఉద్దేశాలను కర్తవ్యాలను తీవ్ర ఆవేదనతో నిర్దేశించారు.

ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి..... విద్యా, ఆర్థిక, సామాజిక అసమానతల విముక్తి కోసం ఎన్ని త్యాగాలైన చేయాలనీ, అవసరమైతే తమ జీవితాలను కూడా త్యాగం చేయాలనీ కోరారు. ఇక రాజకీయ నాయకులకు ఉద్దేశించి .....'నిన్ను నీవు అమ్ముకుంటే అంతకంటే మోసం మరొకటుండదు. నాకు ఎవ్వరివల్ల లేని భయం మీవల్లనే ఉంది' అని ఆవేదన చెందారు. ఉద్యోగులు కచ్చితంగా కనీసం 20% సంపాదనను సమాజం బాగు కోసం వెచ్చించాలని, రిజర్వేషన్‌ను ఉపయోగించుకొని పొందిన ఉద్యోగం ...అదే జాతి ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగించాలి. పేద ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా ఉంటూ, అణగారిన వర్గాల ప్రతినిధిగా బాధ్యత వహించాలి తప్ప ,రిజర్వేషన్ ఫలానాను నీరుగారుస్తూ, అగ్రవర్ణ ఆధిపత్య నాయకుల చెప్పుచేతుల్లోకి వెళ్లి, అవినీతి అధికారులుగా, జాతికి వెన్నుపోటు పొడవరాదని విజ్ఞప్తి చేశారు

విద్యార్థులు, యువకులను ఉద్దేశించి, '... గుమస్తా ఉద్యోగాల లాంటివి చేయకుండా, ఎవరెవరి గ్రామాలలో వారు నిస్వార్థ సేవ చేయాల'ని సూచించారు.ఉన్నత ఉద్యోగాల్లో భాగ్యస్వాములు కావాలని కోరారు. క్రమం లో భాగంగానే అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే కాన్షీ రామ్ స్థాపించిన (మైనారిటీ ఉద్యోగుల సమాఖ్య) సంస్థ కూడా ఉద్యోగుల చేత ,ఉద్యోగుల కొరకే పనిచేసింది తప్ప సమాజంకోసం పనిచేయలేదు. కాన్షీరామ్ ఉన్నంతవరకూమాత్రమే అది బాగా పని చేసింది. ఇక డిసెంబర్ 6 మరియు ఏప్రిల్ 14 సంప్రదాయ దినాలుగా, ఏప్రిల్ మాసమంతా ఒక పవిత్ర మాసంగా పరిగణించడానికి, కేవలం పూలమాలలు వేసి,పెద్ద పెద్ద గాలి మాటలు మాట్లాడి చేతులు దులుపుకునే రోజులుగా తయారయ్యాయి.
నిజమైన అంబేద్కర్ వాదాన్ని అవలంబిస్తే దేశంలో బ్రతకలేమని ,నిజమైన అంబేద్కర్ వాదం ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో సాధ్యం కాదని వారు పేర్కొంటున్నారు.

సుదీర్ఘ కాలం అంబేద్కర్ వాదులమని చెప్పుకునే వారు ఏమి సాధించారని ?అంబేద్కర్ వాదాన్ని తప్పుదోవ పట్టించి,తమకు అనువైన రీతిలో ఆయన వాదాన్ని మలుచుకుని, నకిలీ వాదులుగా తయారయ్యారు. నిజమైన అంబేద్కర్ వాదులవల్ల జరిగిన సమాజ మార్పును చూస్తే తెలుస్తుంది అసలు వాదమేమిటో. రెండు మూడు లక్షల జనాభా ఉన్న దేశాలే కలిసి మెలిసి ఉండలేక ,తమకు రాజ్యాంగం కావాలో నిర్ణయించుకోలేక (నేపాల్),తమలో తామే కొట్టుకుంటూ,దేశ ఐకమత్యం మిథ్యగా తయారవుతున్న కాలం లో కూడా ....ఇన్ని జాతులు,ఇన్ని కులాలు, ఇన్ని వివక్షలు ఉన్న దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అవలంబించబడుతుంది అంటే అదిఅ ంబేద్కర వాదం వల్లే. దేశం ముక్కలు కాకుండా ఉంది అంటే...ఇంకా....... మనుధర్మ శాస్త్రాన్ని తప్ప ఇంకో శాస్త్రాన్ని అంగీకరించని దేశ ప్రధానమంత్రి సైతం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగమే అత్యున్నత గ్రంథమని, దానివల్లనే దేశం శోభిల్లుతుందని కితాబిచ్చాదంటే అది కేవలం అంబేద్కర్ పోరాటాల వల్ల ,అంబేద్కర్ వాదం వల్ల మాత్రమే. .2000 ఏళ్ళు మనుధర్మ శాస్త్ర భావనియంత్రణలో ఉన్న భారతదేశం లో ఇంతకంటే ఎక్కువ ఎం కావాలి?ఇంతకంటే ఎక్కువ సాధించాలన్నా, అది కేవలం అంబేద్కర్ వాదం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.మరే ఇతర మార్గం ,మరే ఇతర వాదం, అంబేద్కర్ వాదానికి సాటిరాదు..అంబేద్కర్ వాదం అద్వితీయమైనదని చెప్పక తప్పదు.అయన వాదం ఎంత సంఘర్షణలతో కూడుకున్నతో అంత ఆకర్షణీయమైనది .

అంబేద్కర్‌కు ఎప్పుడూ, పదవి పైనా వ్యామోహం లేదు. సంపద ఉన్నా లోభం లేదు. దేశంలోని ఉన్నతమైన పదవులు ఆయనిక లభించాయి. హైకోర్టు న్యాయమూర్తి పదవి ఆయనికి రాబోయింది.రాష్ట్రపతిగా కూడా ఆయన పేరు చర్చకి వచ్చింది. కాని ఆయన ఎప్పుడు పదవుల కోసం ఆకాంక్షించలేదు.అయినా కూడా భారతదేశ అత్యున్నత గౌరవ శిఖరాన్ని చేరారు.అయిన కూడా దేశ ప్రజానీకానికి కావలసినదాని కంటే ఎక్కువే చేశారు. అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని, వాటిని కోరుకున్నాడని ...అంబేద్కర్ పేరును తెలంగాణా ఉద్యమ సమయంలో విపరీతంగా ప్రస్తావించిన తెలంగాణా వాదులు ...నేడు అదే అంబేద్కర్ ఆశయాలను విరుద్ధంగా అంటే ఆగమశాస్త్రం ప్రకారం పాలన సాగించడం, మహిళలకు మంత్రివర్గం లో స్థానం ఇవ్వకపోవడం, పోలీసు వ్యవస్థ్తను ప్రోత్సహిస్తూ ఎన్‌కౌంటర్లు చేయించడం, వంటి అప్రజస్వామిక చర్యలకు పాల్పడుతోంది. తెలంగాణా ప్రభుత్వంలో ఉంటూ అంబేద్కర్ వాదులమని చెప్పుకునే వారు వీటిని ఎందుకు ప్రశ్నించరు? పార్టీలో ఉన్న , ప్రాంతంలో వున్నా .. అంబేద్కర్ వాదం ఒకేలాగ ఉంటుంది తప్ప ..పార్టి పార్ట్టీకి అంబేద్కర్ వాదం మారదు. ఇంకా అంబేద్కర్ వాడులమంటూ,మేమే అంబేద్కర్ జయంతులను నిర్వాహిస్తామంటే ....అంబేద్కర్ ఆశించిన నైతికత ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి వారి వల్ల అంబేద్కర్ ఆశయానికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.

ఇక ఇప్పుడు దళితులల్లో నయా దళితవాదులు బయలుదేరారు.ఇదివరకే ఉన్న సంప్రదాయ అంబేద్కర్ వాదులను మాత్రం లెక్కచేయకుండా, ఏదో కొంత ఆర్థిక స్థిరత్వం, ఆధునిక వస్త్రాధారణ సాధించినత మాత్రాన ....మిగతా అంబేద్కర్ వాదులను మరింత అంటరానివారిగా చూస్తూ, అగ్రవర్ణాల మెప్పు పొందడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇలాంటి వారి వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు.ఇంకా ఇదే దేశంలో కొందరు వారి వారి అధికారిక ఆఫీసుల్లో అంబేద్కర్ ఫొటోను పెట్టుకోవాదానికి జంకుతున్నారు. అగ్రవర్ణాలు తనను అంబేద్కర్ వాది అనుకుంటారేమోనని, దళితుడు అని గుర్తుపట్టి అంటరానివారిగా చూస్తారేమో అని,భయపడుతున్నారు.ఇంత అనాగరికంగా ఆలోచిస్తే ఇక స్వేచ్ఛ ఎక్కడున్నట్టు ? స్వతంత్రం ఎలా వచ్చినట్టు,,,,,,? ఇంకా అంటరానితనం ఎలా రూపుమాపబడినట్టు? అంబేద్కర్ ఫొటో పెట్టుకోవడమంటే దళితుడిగా .అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక సైనికుడిగా చెప్పుకునే ఒక గొప్ప అవకాశాన్ని పొందడం.అంబేద్కర్ వాదమంటే కేవలం ఎదో ఒక కులానికి ,మతానికి,జాతికి చెందినది కాదు. అంబేద్కర్ వాదం మానవవాదం,విశ్వజనీనం. ఆదునిక భారత నిర్మాణమే మన ప్రజాస్వామ్య లక్షణం,లక్ష్యం కూడా.నిజంగా దిశగానే మనం ఉన్నామా? దిశగానే మనం ప్రయానిస్తున్నామా? దిశ గానే ఆలోచిస్తున్నమా?? దిశ గానే మన దృక్పథాలు ఉన్నాయా అనేది ఒక్కసారి పునఃపరిశీలించుకోవాలి..మనం ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తున్నమో ,నిర్మించాబోతున్నామో మనకే అవగతమవుతుంది.


ఇదే క్రమంలో నేడు భారతదేశంలో సంస్కృతి పేరుతో జరుగుతున్న వికృత చేష్టలను గమనిస్తే ...అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామ్యానికి ,మానవత్వ భారత్ కి మరింత దూరంగా జరుగుతున్నామని అర్థమవుతుంది .స్త్రీలు వంతగదికే పరిమితమవ్వాలనడం ఒకప్పటి నియమం.అది మన సంస్కృతి అంటున్నారు. ఇలాంటి నిర్జీవ సంస్కృతి ఇంకా స్త్రీ లపై ఎన్నో రకాలుగా వివక్ష ను కొనసాగిస్తూనే వుంది..సంస్కృతి ప్రజాస్వామ్యబద్ధ సంఘ నిర్మాణానికి అతీతమైనది కాదు. కృత్రిమ విభేదాలకు అతీతమై,సమానత్వం ,సమానావకాశాలు ప్రతిపదికగాగల రాజ్యంగబద్ధంగా ఉండేదే అంబేద్కర్ ఆశించిన భారతం.